ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇరాన్‌లో 1,000 మందికి ఉరిశిక్ష అమలు

  • గత వారంలోనే కనీసం 64 మందికి మరణశిక్ష అమలు
  • ఇరాన్‌లోని మరణశిక్షలపై మానవ హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆందోళన
  • గత ఏడాది 975 మందికి మరణశిక్ష విధించిన ఇరాన్
  • గత మూడు దశాబ్దాల్లో ఏ సంవత్సరం అత్యధిక మరణశిక్షలు
2025 సంవత్సరంలో ఇప్పటివరకు ఇరాన్‌లో 1,000 మందికి ఉరిశిక్ష విధించారు. ఇరాన్ మరణశిక్షలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత వారంలోనే కనీసం 64 మరణశిక్షలు అమలయ్యాయని, ఈ ఏడాది ఇప్పటి వరకు రోజుకు సగటున తొమ్మిది కంటే ఎక్కువ ఉరిశిక్షలు అమలు చేయబడ్డాయని నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ వెల్లడించింది.

గత ఏడాది ఇరాన్ 975 మందికి మరణశిక్షను విధించినట్లు అంచనాలు ఉన్నాయి. ఇరాన్‌లో మరణశిక్షలు బాహ్య ప్రపంచానికి తెలిసిన దాని కంటే ఆ సంఖ్య ఎక్కువగానే ఉండి ఉండవచ్చని ఐహెచ్ఆర్ డైరెక్టర్ మహమూద్ అమిరీ మొగద్దాం అభిప్రాయపడ్డారు.

1979 ఇస్లామిక్ విప్లవం, ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత 1980, 1990లలో ఉరిశిక్షలను అమలు చేయడం ప్రారంభించింది. అయితే గత మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో ఈ శిక్షలను ఇరాన్ అమలు చేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో ఇరాన్ జైళ్లలో సామూహిక హత్యాకాండను ప్రారంభించిందని, అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతిచర్యలు లేకపోవడంతో ఇది మరింత తీవ్రమవుతోందని ఐహెచ్ఆర్ డైరెక్టర్ మహమూద్ అమిరీ ఆందోళన వ్యక్తం చేశారు.

వచ్చే వారం న్యూయార్క్‌లో జరిగే యూఎన్ జనరల్ అసెంబ్లీలో, మానవత్వాన్ని మంటగలుపుతున్న ఈ ఉరిశిక్షల అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. మానవ హక్కులపై చిత్తశుద్ధి కలిగిన దేశాలు ఇరాన్‌లో ఉరిశిక్షల సంక్షోభం అంశాన్ని ఎజెండాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇరాన్‌లో ఉరిశిక్షలు ఎక్కువగా బహిరంగంగా అమలు చేయబడుతున్నప్పటికీ, కొన్ని జైళ్ళలోనూ అమలవుతున్నాయి.

Iran Human Rights
Iran
Iran executions
death penalty
Mahmood Amiry-Moghaddam
Islamic Revolution

More Telugu News